కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల వరకు 10,17,140 పరీక్షలు నిర్వహించింది. మొదటి లక్ష పరీక్షలు చేయడానికి 59 రోజుల సమయం పట్టగా, ప్రస్తుతం కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 1.05 లక్షల పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట ఉన్నాయి.
అలాగే రాష్ట్రంలో మార్చి 6 వ తేదికి ముందు ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. ప్రస్తుతం వైరాలజీ ల్యాబుల సంఖ్య 14కు పెరిగింది. 13 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో ల్యాబ్ ఏర్పాటు చేశారు. 14 వైరాలజీ ల్యాబొరేటరీల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలోని మంగళగిరి ఎయిమ్స్ లో వైరాలజీ ల్యాబ్ తో పాటుగా, 4 ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి.
మరోవైపు ఏపీలో జూలై 5 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18697 కు చేరింది. కరోనా వైరస్ వలన రాష్ట్రంలో 232 మంది మరణించారు. ఇప్పటికే 8422 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో అయ్యారు. ప్రస్తుతం 7907 మంది ఆసుపత్రుల్లో, 2136 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 10043 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu