ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 25, శనివారం ఉదయం జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్లు, ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా అన్ని చోట్లా ఉదయం 10 గంటల్లోపు ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు అధికారులు నామినేషన్లు స్వీకరణ నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ నామినేషన్ల పరిశీలన జరగనుంది. 12 గంటలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటన, 1 గంట వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు.
ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం, కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను చేపట్టనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. చేతులు ఎత్తే విధానం ద్వారా అన్ని చోట్లా జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్లులను ఎన్నుకుంటారు. ఏదైనా కారణాలతో ఏదైనా మండలంలో శనివారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడితే, ఆయా మండలాల్లో ఆదివారం ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం నేటి నుంచి ఐదేళ్ల పాటు కొనసాగనున్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ 502 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో 13 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్ల పదవులను కూడా వైఎస్సార్సీపీ దక్కించుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ