రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 22, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర దర్యాప్తుకు కోరుతూ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చకు స్పీకర్ అనుమతివ్వగా, ఈ తీర్మానాన్ని ఆమె సభలో చదివి వినిపించారు. స్వతంత్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె తెలిపారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై కేబినెట్ సబ్ కమిటీ చేసిన విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. 4,070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన విషయాన్ని ఆధారాలతో ఇంతకు ముందే సభలో చర్చించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ జరిపి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తీర్మానంపై మంత్రులు, ఇతర సభ్యులు ప్రసంగించారు. చర్చ పూర్తయిన అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది.
[subscribe]