తెలంగాణ రాష్ట్రంలో నేడు జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు అందిన సమాచారం మేరకు 75 శాతం పైగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతం సమాచారం తెలియాల్సి ఉంది. 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్ జరగగా అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు, వాగ్వాదాలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పోరేషన్లకు చెందిన 324 డివిజన్లలో, 120 మునిసిపాలిటీలకు చెందిన 2647 వార్డుల్లో పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో 11,099 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం ఏడుగంటల నుంచే అన్ని చోట్లా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా తరలి వచ్చారు.
కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముందుగా ఒంటి గంట వరకు 56 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 3 గంటలకు 67.46 శాతం పోలింగ్ నమోదయింది. ఇప్పటికే 80 మునిసిపల్ వార్డులు, ఒక కార్పోరేషన్ డివిజన్ ఏకగ్రీవం అయినట్టు అధికారులు ప్రకటించగా, ఈ రోజు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 25న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగనుండగా, అక్కడ ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 27న చేపడతారు.
[subscribe]