ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ శాసన సభాపక్షం జనవరి 22, బుధవారం నాడు లేఖ రాసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా స్పీకర్, అధికార పార్టీ సభ్యులు అవలంభిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని టీడీపీ శాసనసభా పక్షం లేఖ ద్వారా గవర్నర్కు ఫిర్యాదు చేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాసనసభలో, శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నరును టీడీపీ కోరింది. ప్రతిపక్ష సభ్యులను దూషించడంతో పాటుగా సీఎం వైఎస్ జగన్, మంత్రులు బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నా స్పీకర్ మౌనం వహిస్తూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సభ యొక్క నిబంధనలను ఉల్లంఘించి, పక్షపాత ధోరణితో తమకు నచ్చినట్టుగా అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ రోజు సమావేశాల సందర్భంగా స్పీకర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకముందే మార్షల్స్ తమ బలవంతంగా బయటకు గెంటి వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. సమావేశాల సందర్భంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేస్తున్నారని, శాసన మండలిలో జరుగుతున్న వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేయాలనీ టీడీపీ పార్టీ లేఖలో పేర్కొంది.
[subscribe]