ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహిస్తూ.. ఈ బడ్జెట్ సెషన్ చివరి వరకూ వీరిపై సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులు. కాగా, ఈ సభ్యులపై సస్పెన్షన్ అసెంబ్లీ సమావేశాలు జరిగేంత వరకు వర్తిస్తుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సభా నియమావళిని గౌరవించాలని స్పీకర్ కోరారు. సస్పెన్షన్ విధించిన తర్వాత కూడా ఆయా సభ్యులు సభనుంచి కదలకపోవడంతో బయటకు తీసుకెళ్లాలని మార్సల్స్ను ఆదేశించారు.
ఈరోజు సమావేశాలు మొదలవగానే టీడీపీ సభ్యులు, ఏపీలో సంచలనంగా మారిన జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే, రూల్స్ ప్రకారం రావాలని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ అంశంపై వెంటనే చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు తమ వద్ద ఉన్న కాగితాలను చింపివేసి స్పీకర్ పోడియంపై పడవేశారు. దీంతో, స్పీకర్ సభను కొంతసేపు వాయిదా వేసారు. అయితే, తిరిగి సభ ప్రారంభమైన అనంతరం కూడా టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. ఈ సమయంలో మంత్రి కొడాలి నాని జోక్యంచేసుకుని వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేనికు సూచించారు. అయితే, టీడీపీ సభ్యులు దీనిపై అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రస్తావిస్తున్నది ప్రజా సమస్య అని.. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో తమ ఆందోళనను విరమించుకోకపోవడంతో అసెంబ్లీ నుంచి ఈ ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ చేశారు. కాగా, టీడీపీ సభ్యుల ప్రవర్తనపై సీఎం జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ