ఎనిమిదవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు చేశారు. ఇళ్ళ స్థలాల పంపిణీ, ఇళ్ళ నిర్మాణంపై లఘు చర్చ జరిపిన అనంతరం పలు కార్పొరేషన్ల వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే సభ ప్రాంభమవగానే టీడీపీ సభ్యులు ఈరోజు కూడా తమ ఆందోళనలను కొనసాగించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చించాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీడీపీ సభ్యులు సభలో తమ నిరసనను తెలియజేశారు.
కాగా టీడీపీ సభ్యుల తీరుపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిరోజూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని, నిబంధనల ప్రకారం సభ జరుగుతుందని పేర్కొన్నారు. సభలో టీడీపీ సభ్యులు సెల్ ఫోన్ వాడుతున్నారని తన వద్ద సమాచారం ఉందని, వాటిని సెక్యూరిటీ వద్ద ఉంచాలని స్పీకర్ తమ్మినేని ఆదేశించారు. సభాకార్యక్రమాలను సెల్ ఫోన్ లో చిత్రించటం నిషిద్ధమని, టీడీపీ సభ్యులు సభ మర్యాదను, గౌరవాన్ని కాపాడాలని సూచించారు. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు ఆర్డర్లో లేదని తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ అసెంబ్లీలో ఉన్న టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ