ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7, గురువారం నుంచి అక్టోబర్ 15, శుక్రవారం వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి గవర్నర్ తొలిపూజలు చేశారు. ముందుగా గవర్నర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ ఘన స్వాగతం పలికారు.
అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజున కనకదుర్గమ్మ అమ్మవారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. అలాగే కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని కోరుకున్నానన్నారు. ప్రజలంతా దసరా ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని, ఇంద్రకీలాద్రిపై భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. మరోవైపు దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మూల నక్షత్రం రోజున(అక్టోబర్ 12) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ