ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గన్నవరం నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తదితరులు సీఎం జగన్కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుపతి సమీపంలోని పేరూరులో శ్రీ వకుళామాత ఆలయానికి చేరుకున్నారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. ఈ క్రమంలో వివిధ పూజలలో పాల్గొని వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్, అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఆయన మొక్కను నాటారు.
గురువారం మహా సంప్రోక్షణం సందర్భంగా బుధవారం పాతకాల్వలోని వకుళామాత ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అంతకుముందు ఉదయం రత్నాధివాసం, విమాన గోపురకలశ స్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం తదితర వైదిక క్రతువులు నిర్వహించారు. దీనిలో ఎంపీ పీవీ మిథున్రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు అశోక్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా గత మూడేళ్ల క్రితం టిటిడి ఆధ్వర్యంలో 83.42 ఎకరాల్లో వకుళామాత ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. ఇక్కడ కల్యాణ మండపం మరియు విశ్రాంతి గృహాన్ని కూడా టిటిడి నిర్మిస్తోంది. నేటి మధ్యాహ్నం తర్వాత ఆలయాన్ని భక్తుల కోసం తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ ఆగమ సలహాదారు డాక్టర్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు స్థల పురాణం గురించి వివరించారు. స్కంద, వరాహ, భవిష్యోత్తర పురాణాల ప్రకారం శ్రీ వకుళమాత శ్రీవేంకటేశ్వరుని తల్లిగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ఆలయ విశిష్టతను వివరిస్తూ ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేశామని, టీటీడీ సహకారంతో గోపురానికి 20 కిలోల బంగారంతో బంగారు తాపడం చేశామని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి జగన్ శ్రీకాళహస్తి చేరుకొని అక్కడ ఇలగనూరు వద్ద కొత్తగా నిర్మించిన ‘అపాచి’ పాదరక్షల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY