ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 18, శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. ముందుగా జనవరి 20న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ముందుగా జరపడం మంచిదనే ఆలోచనతోనే రేపటికి మార్చినట్టుగా తెలుస్తుంది.
అలాగే రాజధాని అంశంపై నివేదికలను పరిశీలించడానికి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యి ప్రజంటేషన్ ఇచ్చింది. ఇక రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించి హైపవర్ కమిటీ ఇచ్చే తుది నివేదికపై చర్చించనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులు, వాటి అమలు, తదుపరి చర్యలపై పూర్తిస్థాయిలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
[subscribe]