2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేసి, జనవరి 22 ఉదయం 7 గంటలకు వారిని ఉరితీయాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులలో ఒకరైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత నెలకొంది. అయితే ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ జనవరి 17, శుక్రవారం నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. నలుగురు దోషులను ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరితీయాలని ఆదేశాలు జారీ చేసింది.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడానికి ఇంకా 14 రోజుల సమయం ఉంది. క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన సమయం నుంచి ఉరితీసేందుకు రెండు వారాల పాటు సమయం ఉండాలన్న చట్ట నిబంధన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన అనంతరం దోషుల ఉరిశిక్ష అమలకు కొత్త తేదీ, సమయం చెబుతూ మళ్ళీ డెత్ వారెంట్ ఇవ్వాల్సిందిగా తీహార్ జైలు అధికారుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఈ విచారణ సందర్భంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని దోషి ముఖేశ్కు సమాచారం ఇవ్వాల్సిందిగా జైలు అధికారులకు సాయంత్రం వరకు సమయమిస్తూ కోర్టు వాయిదా వేశారు. అనంతరం దోషికి సమాచారం అందించిన విషయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలుపగా, ఉరిశిక్ష తేదీల్లో మార్పులు చేస్తూ కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.
[subscribe]