ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్తో పాటు మొత్తంగా రూ. 23,985 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సోమవారం తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలంయలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప జిల్లాలో రూ. 8,800 కోట్లతో జేఎస్ డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని, తద్వారా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది.
కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పాదక కంపెనీ అయిన ‘జేఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్’ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రెండు విడతల్లో మొత్తంగా రూ. 8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనిలో భాగంగా మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడితో మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తితో పాటు మొత్తంగా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులను లక్ష్యంగా పరిశ్రమ ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపింది. జేఎస్ డబ్ల్యూ గ్రూప్ స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్ రంగాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇది ఏడాదికి 27 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులను తయారుచేస్తుంది. దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీగఢ్, ఒడిశాల్లో జేఎస్ డబ్ల్యూ కి కర్మాగారాలు ఉన్నాయి.
అలాగే 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దాదాపు రూ. 6,330 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 4వేల మందికి ఉపాధి కలుగనుంది. దీనితో పాటుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో 1,000 మెగావాట్లు ప్రాజెక్టు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. వీటిని 2024 డిసెంబర్లో ప్రారంభించి నాలుగేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిద్వారా ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. అలాగే రూ. 8,855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు కూడా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్టు కలిపి మొత్తం 2100 మెగావాట్ల ఉత్పత్తి లభించనుంది. వీటిని వచ్చే ఏడాది జులైలో ప్రారంభించి విడతల వారీగా ఐదేళ్లలో డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక వీటిద్వారా ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ