ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు వైజాగ్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 28వ తేదీన ఇంటి స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రకటించారు. దీనిపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండేతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు పిడివాడ అగ్రహారంలో జగనన్న ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని, లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలను సీఎం జగన్ అందజేయనున్నారని తెలిపారు. ఇందులో మొత్తం 2,79,000 ఇళ్లకు గాను.. పట్టణ ప్రాంతాల్లో 1,00,000 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,79,000 ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణాలకు నిధుల సమస్య లేదని, ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 24,000 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో లక్ష ఇళ్లను మే 15 నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ