ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తొలిసారిగా స్పందించారు. గత నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పెట్రోల్ మరియు డీజిల్పై పన్నులను తగ్గించలేదని అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ కోరారు. ప్రపంచంలో పలు దేశాల్లో పరిస్థితుల కారణంగా సరఫరా వ్యవస్థ ప్రభావితం అవుతుండడంతో సవాళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు, ప్రస్తుత పరిస్థితిపై బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశంపై ప్రధాని మాట్లాడుతూ, గత నవంబర్లో ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని అన్నారు. అలాగే పన్నులను తగ్గించి, ఆ ప్రయోజనాలను పౌరులకు బదిలీ చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరిందని అన్నారు. కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయని, మరి కొన్ని రాష్ట్రాలు తగ్గించకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికి ఎక్కువగానే కొనసాగుతున్నాయన్నారు. దీనివలన ప్రజలపైనే కాకుండా, పొరుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారు.
ఎవరినీ విమర్శించడం లేదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాలు కొన్ని కారణాల వల్ల లేదా ఏదైనా కారణాల వలన కేంద్ర ప్రభుత్వం సూచన పాటించడం లేదని, దీంతో ఆయా రాష్ట్రాల్లో పౌరులపై ఇంధన ధరల భారం కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడం ద్వారా పౌరులకు ప్రయోజనాలు అందించాలని ప్రధాని మోదీ కోరారు. మరోవైపు గతేడాది నవంబర్లో పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10ల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ