కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారిగా పర్యటన చేయనున్నారు. ఆయన రేపు జిల్లాలోని ఐ. పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,19,000 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద లబ్ధి కలుగనుంది. ఈ పథకం ద్వారా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేధం అమలవుతున్న కారణంగా ఆదాయం కోల్పోనున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు 2019 నుంచి ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం రూ.10 వేలు ఆర్ధికసాయం అందిస్తోంది.
మరోవైపు ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారులకు ప్రకటించిన 108 కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా సీఎం జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలో మూడు ముఖ్యమైన వంతెనలకు జగన్ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 11న ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. అసని తుఫాన్ కారణంగా కోస్తా జిల్లాల్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రేపటికి వాయిదా వేశారు. కాగా సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం.. రేపు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి సుమారు 10.20 గంటలకు ఐ పోలవరం మండలం కొమరగిరి చేరుకోనున్నారు. 10.45 గంటల సమయంలో మురమళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్దిదారులకు నిధులు అందజేయనున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చివరిగా మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో వేదిక వద్దనుంచి బయలుదేరి సుమారు 1.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ