టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సోమవారం 93వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన పట్టణంలోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పలువురు న్యాయవాదులు లోకేష్ను కలుసుకుని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారని, అలాగే ఇక్కడ కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీని కూడా సీఎం జగన్ తరలించారని లోకేష్ దృష్ఠికి తెచ్చారు. ఒకవైపు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో చెప్పిందని, మరోవైపు విశాఖలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారని వివరించారు. వైసీపీ నేతలు చెప్పిన మాటలు విని మోసపోయామని ఆవేదన వ్యక్తం చేసిన న్యాయవాదులు.. టీడీపీ పార్టీ అయినా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ స్పందిస్తూ.. సీఎం జగన్ అనేక వర్గాలను మోసపుచ్చారని, చివరకు న్యాయవాదులను కూడా మభ్యపెట్టారని మండిపడ్డారు. అయితే వైసీపీ నేతల్లాగా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ తమది కాదని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. దీంతో న్యాయవాదులు నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఇక అంతకుముందు సోమవారం ఉదయం ఎస్టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్ను ముందుగా మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిసి తమ సమస్యలను తెలియజేశారు. అనంతరం కర్నూలు 50వ డివిజన్ టిడ్కో బాధితులు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. వార్డుల్లో మంచినీరు సరిగా రావడం లేదని, విద్యుత్ స్తంభాలు, విద్యుత్, డ్రైనేజి సమస్యలు ఉన్నాయని, 50వ వార్డులో పార్కు, లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి లోకేష్ స్పందిస్తూ.. టీడీపీ అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 50వ డివిజన్లో ఖాళీస్థలాన్ని గుర్తించి పార్కు, లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE