రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, బాధితులకు అందుతున్న చికిత్స, పలు ఇతర అంశాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 15, బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించాలని, రోజువారీ కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే వారికీ ఇంటికి వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాలని, ప్రతి వారం వచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, పాజిటివ్గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. మరో నాలుగైదు రోజుల్లో కరోనా వైరస్ పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచుతామని అధికారులు తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32 వేల మందికి కూడా కరోనా పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అరటి, పుచ్చ ఉత్పత్తుల మార్కెటింగ్పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రైతులను ఆదుకోవడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu