ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ను జారీ చేసింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తికీ లేదా ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసేవారికి డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ ను విదేశాంగ కార్యాలయం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన రెండు నెలల తరువాత, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జగన్ మోహన్ రెడ్డికి తన డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ ఇచ్చింది. ఈ పాస్ పోర్ట్ తీసుకునేందుకు ఆయన సతీసమేతంగా విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటివరకు సాధారణ పాస్ పోర్ట్ కలిగిన వై.ఎస్ జగన్, విదేశీ ప్రయాణాల నేపథ్యంలో ప్రోటోకాల్ వర్తింపజేసేందుకు వీలుగా ఈ డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ జారీ చేశారు. ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లిన ఆయన చేతి వేలి ముద్రలు,ఇతర సంబంధిత వివరాలను అధికారులకు అందజేశారు.
కొద్దీ రోజుల క్రితమే తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 15 తరువాత అమెరికా వెళ్లి, వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరు కానున్నట్టు సమాచారం. గతంలో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ ఇవ్వబడింది. అయితే, ఎపి ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు నాయుడు తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను సంబంధిత అధికారులకు సమర్పించారు.
[subscribe]
[youtube_video videoid=BVxnCta6udo]