ఆంధ్రప్రదేశ్లో మాండూస్ తుఫాను కారణంగా కొన్ని జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలు.. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లోని బాధితులకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీని ప్రకారం.. ఒక వ్యక్తికి రూ.1000, అలాగే కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఇక మాండూస్ తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
మాండూస్ తుఫానుపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- తుఫాను కారణంగా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించాలి.
- రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందన్న భరోసా కలిగించాలి.
- ధాన్యం తడిసినా, రంగు మారినా రైతుల నుంచి కొనుగోలు చేయాలి.
- ఒకవేళ రైతులు బయటి వ్యక్తులకు అమ్ముకున్నా సరే, వారికి గిట్టుబాటు ధర కల్పించాలి.
- పంటలు దెబ్బతిన్న చోట మళ్ళీ వేసుకోవడానికి 80% సబ్సిడీతో విత్తనాలు అందించాలి.
- తుఫాను బాధిత కుటుంబాలకు రూ.2వేలు ఆర్ధిక సాయం అందించాలి.
- పట్టణాలు, పల్లెలు సహా అన్ని ప్రాంతాల్లో దీనిని వర్తింపజేయాలి.
- ఇక ఇళ్ళు, పశువులు, పంటలు సహా తుఫాను కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయాలి.
- నష్ట పరిహారం అంచనాల నమోదు ప్రక్రియను వారం రోజుల్లోగా ముగించాలి.
- తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE