ఒకవేళ తాను పార్టీ మారాల్సి వస్తే, మీడియాకు చెప్పే చేస్తానని ప్రకటించారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పార్టీ మార్పుపై ఆయన సోమవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 26న విశాఖపట్నంలో ఏపీలోని పలువురు కాపు నేతలు ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నేడు విశాఖలో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కాపునాడు పోస్టర్పై వంగవీటి రంగా, మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ చిత్రాలను ముద్రించారు. అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం రాధా-రంగా మరియు రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతోందని, కాపుల అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం తలపెట్టినా తాను ముందు ఉంటానని పేర్కొన్నారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఇది జరగాల్సి ఉందని, కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో తాను పాల్గొన్నానని తెలిపారు.
ఇక వంగవీటి రంగా బడుగు, బలహీన వర్గాల నాయకుడని, ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో ఆయనను పరిమితం చేయడం తగదని అన్నారు. కాపునాడు సభను విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఇక తన పార్టీ మార్పుపై ప్రతిసారి మీడియానే అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, పార్టీ మార్పుపై తానెప్పుడూ మాట్లాడలేదని గుర్తు చేశారు. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని, అందరికీ చెప్పే చేస్తానని గంట శ్రీనివాస రావు స్ఫష్టం చేశారు. కాగా గంటా శ్రీనివాసరావు పార్టీని వీడి వైఎస్ఆర్సిపిలో చేరబోతున్నారంటూ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE