ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా రంగంపై గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆంగ్ల బోధన, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఏపీ విద్యాశాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ‘బైజూస్’ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్తో ముఖ్యమంత్రి సమావేశమై ఇ–లెర్నింగ్ విధానంపై సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం జగన్ సమక్షంలో వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో బైజూ రవీంద్రన్ అమెరికా నుంచి పాల్గొనగా.. ప్రభుత్వం తరపున కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేష్కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దీని ద్వారా నాణ్యమైన విద్య కోసం ఏడాదికి రూ. 20 వేల పైగా ఫీజు చెల్లించాల్సిన ‘బైజూస్’ ఇ– తరగతులు ఇకపై విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్ లోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుందని తెలిపారు.
ప్రభుత్వ స్కూళ్లలోని 4-10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ద్వారా నాణ్యమైన కంటెంట్ తో పాటు పిల్లలకు సులభమైన పద్ధతుల్లో బోదించటానికి విజువలైజేషన్ విధానం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తామని, ఈ ట్యాబ్లకోసం దాదాపు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం 8 తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ విధానంలో రాస్తారని తెలిపారు. అలాగే పదవ తరగతి ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ‘బైజూస్’ ఇ– తరగతుల ద్వారా మంచి ఫలితాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ