ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 3, శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు’ ను ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సీఎం మాట్లాడుతూ, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే సంకల్పంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, తనకు ఎంతో సంతృప్తికరమైన పథకం ఆరోగ్యశ్రీ అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటిన దగ్గరనుంచి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా, ఆ సంఖ్యను మరో 1000కి పెంచి మొత్తం 2,059 వ్యాధులకు వర్తించే విధంగా మార్పులు చేశామని చెప్పారు.
అలాగే ఫిబ్రవరి మొదటి వారం నుంచి క్యాన్సర్ రోగులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తామని సీఎం ప్రకటించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 42 లక్షల కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. క్యూఆర్ కోడ్తో కార్డులు జారీ చేస్తామని, గ్రామ సచివాలయాల ద్వారా అన్ని గ్రామాల్లో కార్డులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లా పెంచుకుంటూ 2059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
[subscribe]