ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 24, ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 8 జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ పడకలు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
వైద్య సిబ్బంది భర్తీపై వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి స్పందిస్తూ, రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని, త్వరలోనే 9700కి పైగా డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఏపీలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నామన్నారు. కరోనా ప్రభావం ఎక్కువుగా 8 జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ బెడ్లను, 12 వేల వరకు ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మరోవైపు వైద్య పరీక్షల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ రోజుతో కరోనా వైద్య పరీక్షల సంఖ్య 3 లక్షలు దాటుతుందని జవహర్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu