ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనటానికి విశాఖపట్నం విచ్చేశారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చిన సీఎం జగన్.. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి చేరుకున్నారు. మొదటగా అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ చేతులు మీదుగా కలశ స్థాపన చేయించారు. అనంతరం శారదా పీఠంలో ఏర్పాటు చేసిన పండిత సభలో సీఎం పాల్గొన్నారు. ప్రతి ఏటా మాఘమాసం పంచమి నుండి దశమి వరకు శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి.
శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం సందర్భంగా.. ఈ రోజు రాజశ్యామలాదేవి యాగం జరుగుతోంది. రాజశ్యామల యాగం కోసం పండితులు సీఎం జగన్ తో సంకల్పం చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం శంకరాచార్య వేదపాఠశాల విద్యార్థులకు సీఎం జగన్ ఉత్తీర్ణత పత్రాలు అందజేశారు. కాగా, శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనటం వరుసగా ఇది మూడోసారి కావటం విశేషం. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరియు మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. రుత్వికులు లక్ష సార్లు అమ్మవారి నామార్చన చేయనున్నారు. రాజ శ్యామల దేవి అమ్మవార్లకు పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు. చతుర్వేద పారాయణం మధ్య హోమం కొనసాగుతుందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ