ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 22, శుక్రవారం నాడు ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జనవరి లేదా ఫిబ్రవరి నెలల నుంచి రాష్ట్రంలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. రచ్చబండలో ప్రజల నుంచి వచ్చే వినతులపైన హామీలు ఇస్తామని, ఆ హామీలకు సంబంధించి పనులు కచ్చితంగా జరగాలని ఆదేశించారు. ఏదైనా ఒక పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోపు పనులు ప్రారంభం కావాల్సిందే అని అధికారులకు సూచించారు. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయగలిగితే ప్రజలకు మేలు చేసినట్టేనని పేర్కొన్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం జగన్ పలు అంశాలపై సూచనలు చేశారు. నవరత్నాల అమలే చేయడమే ఈ ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అందులోని ప్రతి పథకాన్ని సంతృప్తస్థాయిలో అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ నిధులను అక్కడ కొంత, ఇక్కడ కొంత ఖర్చు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదని అన్నారు. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టి, రాష్ట్రాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టామని, అనవసర వ్యయం తగ్గించడంపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని, అందుకోసం ఢిల్లీలోని అధికారులను సంప్రదించి వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
[subscribe]