జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నవంబర్ 25, సోమవారం నాడు ఏర్పాటు చేసినట్టు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తెలుగు భాష పరిరక్షణ కోసం జనసేన పార్టీ త్వరలో చేపట్టబోయే ‘మన నుడి-మన నది’, డొక్కా సీతమ్మ పేరిట నిర్వహించిన ఆహార శిబిరాలు, ఇసుక లభ్యత- భవన నిర్మాణ పరిస్థితులు, రాయలసీమ లోని పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులు, పార్టీ కార్యకర్తల సమావేశాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు నవంబర్ 6న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని మరింతగా విస్తరిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా పంతం నానాజీ, మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పితాని బాలకృష్ణలను పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా నియమిస్తునట్టు పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
[subscribe]