ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 893 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే నమోదైన 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 590 కేసులు నమోదయ్యాయని, ఈ నాలుగు జిల్లాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. మరోవైపు ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో 676 మండలాలకు గానూ 573 మండలాలు గ్రీన్జోన్లో, 56 రెడ్ జోన్లో, 47 ఆరెంజ్ జోన్లో ఉన్నాయని జవహర్రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 181 కరోనా కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా, అందులో 121 పట్టణ ప్రాంతాల్లో, 60 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో సరిగ్గా కరోనా పరీక్షలు నిర్వహించడం లేదనే చేస్తున్న విమర్శలు సరైనవి కావని, దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, అందరూ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu