గోదావరి డెల్టా ప్రాంతంలోని వరద బాధిత ప్రాంతాల ప్రజలను, ముఖ్యంగా నీట మునిగిన గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడం వల్లనే తెలంగాణాలో మళ్లీ విలీనం చేయాలనే డిమాండ్ ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ సర్కారు నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో మళ్లీ విలీనం చేయాలనే డిమాండ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.
తమను పొరుగు రాష్ట్రంలో కలపమని ప్రజలు అడుగుతున్నారంటే ఆ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని అర్ధమని చంద్రబాబు వివరించారు. ముంపు గ్రామాల్లో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు, నేలకొరిగిన చెట్లను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, వరదలు తగ్గుముఖం పడతాయని చెబుతున్న మంత్రులు.. విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణా పునరుద్ధరణకు ఇప్పటివరకు చర్యలు చేపట్ట లేదని ఆయన ఆరోపించారు. ఇక తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్షాలపై విమర్శలు మానుకుని ముందు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు వెళ్లాలని సీఎం జగన్కు సూచించారు.
వరదల కారణంగా ఇళ్లలోకి కొట్టుకొచ్చిన పశువుల కళేబరాలు, దోమలు, విషసర్పాలు, వంటి దయనీయ పరిస్థితులను, ఆయా ప్రాంతాల బాధితుల వేదనను అర్థం చేసుకోవాలని, గత 14, 15 రోజులుగా వారికి తాగేందుకు నీరు లేదని, సరైన ఆహారం కూడా అందడం లేదని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, స్థానిక అధికారులు కానీ ఆయా గ్రామాల ప్రజలను పట్టించుకోక పోవడంతోనే వారు రోడ్డెక్కుతున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ ప్రాంతాలలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా అప్పటి తెలంగాణలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY