ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏప్రిల్ 3, శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర గరికపాడులో ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద లాక్డౌన్ పరిస్థితులు, భద్రతను పరిశీలించారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాలోని చెక్పోస్టుల సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులపై వాకబు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కరోనాపై కేసుల విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వ్యక్తి లేదా వర్గం యొక్క మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్మీడియాలో పోస్టులు పెట్టవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీసులు, వైద్య సిబ్బంది కరోనా బాధితుల విషయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రజలంతా సహకారం అందించాలని కోరారు.
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల్లో ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారే ఎక్కువుగా ఉన్నారని, ఈ సమావేశాలకు వెళ్లిన వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్కు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆలస్యం అయ్యేకొద్దీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని, ముందుగానే మేల్కొని ఆసుపత్రికి రావాలని సూచించారు. మరోవైపు బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య వ్యవహారానికి సంబంధించి విచారణ జరుగుతుందని చెప్పారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. మరో పది రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ సమయంలో పోలీస్ సిబ్బంది కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
[subscribe]