వైసీపీ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ముందుగా దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకున్న కరోనా ర్యాపిడ్ కిట్ల కొనుగోలు ధర వ్యవహారంపై ఈ వివాదం మొదలైంది. కరోనా ర్యాపిడ్ కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని, ఈ అంశంపై మంత్రులు, అధికారులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.337కే ఒక్కో కిట్ కొనుగోలు చేసిందని, ఏపీలో కమిషన్ కొట్టేశారా? అంటూ ట్విటర్లో కన్నా వ్యాఖ్యానించారు.
కన్నా విమర్శలపై స్పందిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారంటూ ఆరోపించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కన్నా మరింత దీటుగా బదులిస్తూ తనపై చేసిన ఆరోపణల విషయంలో కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి మళ్ళీ స్పందిస్తూ, చంద్రబాబు దగ్గర కన్నాలక్ష్మీనారాయణ రూ.20కోట్లు తీసుకున్నారంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేసేందుకూ సిద్ధమని ప్రకటించారు. ఇందుకు కన్నా బదులిస్తూ ప్రమాణం చేసేందుకు తేదీ, సమయం చెబుతా, సిద్ధంగా ఉండాలంటూ ప్రకటించారు. ఇలా నేతలిద్దరూ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుదో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu