కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్, బాక్సర్ మేరీకోమ్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత హాకీ మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, భారత్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అథ్లెట్ హిమదాస్, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్, పారా అథ్లెట్ శరద్ కుమార్, జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా, బాక్సర్ అమిత్ పంగాల్ సహా 40 మంది ప్రముఖు క్రీడా కారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
కరోనా వైరస్ పై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడంతో పాటుగా ఈ వైరస్ పై ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేయాలని, అలాగే ప్రజల్లో ధైర్యాన్ని పెంపొందిస్తూ, సామాజిక దూరం పాటించాలని కోరాలని క్రీడాకారులకు మోదీ పిలుపునిచ్చారు. క్రీడాకారులు ప్రజలకు ఇచ్చే సందేశాల్లో సంకల్పం, నిగ్రహం, అనుకూలత, గౌరవం, సహకారం అనే ఐదు సూత్రాలను పొందుపరచాలని చెప్పారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను కూడా ప్రజలను పాటించమని కోరాలని విజ్ఞప్తి చేశారు. మైదానంలో పోరాడిన తీరులాగానే ఈ కరోనా మహమ్మారిని కూడా ఎదుర్కోవాలని క్రీడాకారులతో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
[subscribe]