ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్కు పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేస్తున్నారు, అలాగే కొందరు ప్రైవేట్ వ్యక్తులు సైతం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, పరికరాల ద్వారా ఫోన్స్ ట్యాపింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని లేఖలో చంద్రబాబు కోరారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాయడంపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం నాడు డీజీపీ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని లేఖలో డీజీపీ కోరారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారని, ఇంతవరకు అలాంటి ఫిర్యాదులు ఏమి అందలేదని డీజీపీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఇస్తే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu