కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడం, కరోనా పరిస్థితులు కొంచెం మెరుగైన నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించేందుకు అక్టోబర్ 28 వ తేదీన రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలు పాల్గొనే ఈ సమావేశం విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన అనంతరం, ఇతర కార్యాచరణ అంశాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu