ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సంఘాల నేతలు తమ కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించారని పీఆర్సీ సాధన సమితి నేతలు హర్షం వ్యక్తంచేశారు. శుక్ర, శనివారాల్లో మంత్రివర్గ ఉప సంఘంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు తమ డెంనులను ప్రభుత్వం ముందుంచారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఉద్యోగుల డిమాండ్లలో ముఖ్యమైన వాటికి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో.. ఈరోజు నుంచి చేయతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈమేరకు.. నిన్న పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, కె.వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు ముఖ్య నేతలు సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా.. సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తమ డిమాండ్లలో ముఖ్యమైన హెచ్ఆర్ఏ శ్లాబులను పెంచటానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. ఫిట్మెంట్ మినహా మిగతా సమస్యల పరిష్కారానికి సంసిద్ధత తెలిపింది. అలాగే, మరో ముఖ్యమైన డిమాండ్.. సీసీఏ కొనసాగించడంతో పాటు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వడానికి అంగీకరించింది ప్రభుత్వం. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఉద్యోగులకు ఫిట్మెంట్ను 23%కి మించి ఇవ్వలేమని నిస్సహాయత వ్యక్తంచేసింది. కాగా, భవిష్యత్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించటానికి మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ఇకముందు కూడా ఉద్యోగుల సమస్యలపై తీసుకునే నిర్ణయాల్లో సంఘాల నేతలకు తప్పక భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం జగన్ చెప్పారని వారు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ