అనంతపురం జిల్లాలో ఈరోజు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దివంగత ప్రముఖ టీడీపీ నేత పరిటాల రవీంద్ర వారసుడు.. పరిటాల శ్రీరామ్, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జిల్లాల పునర్విభజన చేయనుండటంపై శ్రీరామ్ విమర్శించారు. ఇది కేవలం పొలిటికల్ స్టంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించబోమని శ్రీరామ్ అన్నారు. ఎక్కడో విజయవాడలో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని.. ఇక్కడి ప్రజలకు ఏది అనుకూలమో కూడా ఆలోచించాలని శ్రీరామ్ ప్రభుత్వానికి సూచించారు.
ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వలన జిల్లాలోని 8 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లో రామగిరిని ఏ విధంగా కలుపుతారని శ్రీరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రెవెన్యూ డివిజన్లో మార్పు జరిగిందని పరిటాల శ్రీరామ్ విమర్శించారు. అయితే, దీనికి ముందు ఉదయం ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేసిన దీక్ష టెంట్లను తొలగించారు. తర్వాత, టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు అక్కడ చిన్న వేదిక ఏర్పాటుకు పోలీసులు అంగీకరించారు. అయితే, ప్రస్తుతం దీక్షా ప్రాంగణం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షకు పోలీసులు సహకరించాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ