ఒకప్పుడు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే ఒక రోజంతా భక్తులు క్యూలైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండేవని.. భక్తులకు దాదాపు 2 రోజుల సమయం పట్టేదన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అయితే ఇప్పుడు అమలు చేస్తున్న టైం స్లాట్ విధానం వలన భక్తులు కేవలం రెండు, మూడు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకునే వీలుందని తెలిపారు మంత్రి సత్యనారాయణ. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సత్యనారాయణకు కొత్తగా మంత్రి పదవి వరించింది. తిరుపతిలో రెండు రోజుల కిందట సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల దగ్గర జరిగిన తోపులాటలో కొందరు భక్తులు గాయపడటం తెలిసిందే.
ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టిక్కెట్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిందని తెలియగానే వెంటనే టీటీడీ అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఘటనకు ముందు వరుసగా రెండు రోజులు సెలవులు ఉండటంతో సర్వదర్శనం టిక్కెట్ల కేంద్రాలు ఓపెన్ చేయలేదని, దీంతో భక్తులు అధికసంఖ్యలో రావటంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఎవరికీ వారు త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో ముందుకు ఒక్కసారిగా రావటంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు. అయితే ఇది జరిగిన గంట వ్యవధిలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, అక్కడున్న భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. టీటీడీలో సమర్ధవంతమైన అధికారులు ఉన్నారని, మంచి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఇకపై క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి సత్యనారాయణ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ