తెలంగాణలో డిస్కౌంట్ ఆఫర్పై పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయటానికి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. సమయం తక్కువగా ఉన్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు.. త్వరగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే మళ్ళీ ఇకపై డిస్కౌంట్ వ్యవధిని పొడిగించబోమని వారు తెలిపారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు 75% ఆఫర్ ప్రకటించగా.. ఆర్టీసీ బస్సులు, కార్లు వంటి వాహనాలకు 50% ఆఫర్ ఇచ్చారు. కాగా మార్చి 1వ తేదీన ప్రారంభమైన ఈ డిస్కౌంట్ ఆఫర్ మార్చి 31తో ముగిసింది. అయితే, అప్పటికే పెద్ద ఎత్తున చలాన్లు క్లియర్ చేసినా కూడా, ఇంకా పెండింగ్ లో ఉన్న చలాన్లు భారీగా ఉండటంతో వాహనదారులు గడువును పెంచాలని పోలీసులకు విజ్ఞప్తులు చేశారు.
దీనిపై ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరో 15 రోజులు, అనగా ఏప్రిల్ 15 వరకు గడువును పొడిగించారు. దీంతో డిస్కౌంట్ ఆఫర్పై పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయటానికి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. కాగా ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒకేసారి ఎక్కువ మంది లాగిన్ అవడంతో కొన్నిసార్లు ఏకంగా సైట్ కూడా పనిచేయలేదు. ఇప్పటివరకు 3 కోట్ల వరకు పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని, దీనిద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల భారీ ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. మొత్తం 65 శాతం పైగా పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేశారని, ఈరోజు చివరిరోజు కావడంతో మరికొందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ