తెలుగు రాష్ట్రాలలో క్యాసినో వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్లో చీకోటి ప్రవీణ్ మరియు మాధవ రెడ్డి అనే ఇద్దరు క్యాసినో ఆర్గనైజర్స్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వీరితో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తుస్తున్నాయి. ముఖ్యంగా చీకోటి ప్రవీణ్కు రెండు రాష్ట్రాలలోని కొందరు రాజకీయ నాయకులతో సంబంధాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురి పేర్లు బయటకు రావడంతో వారు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు వైస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు. క్యాసినో ఆర్గనైజర్ చీకోటి ప్రవీణ్తో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. క్యాసినోలకు వెళ్లడం తనకు అలవాటేనని, అయితే ఈ చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. అప్పుడప్పుడు సరదాగా పేకాట ఆడుతుంటానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రవీణ్తో గానీ, అతడు చేసే హవాలా స్కామ్లతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. తప్పు చేస్తే దానిని ఒప్పుకునే ధైర్యం తనకుందని, కానీ చేయని తప్పుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని బాలినేని హెచ్చరించారు. ఇక ప్రతి సచివాలయం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం రూ.20 లక్షలు మంజూరు చేసిందని, ఈ నిధులతో మిగిలున్న ఈ రెండేళ్ల వ్యవధిలో ఒంగోలు పట్టణంలో వీలైనంత అభివృద్ధి పనులు చేస్తానని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ