కామన్ వెల్త్ గేమ్స్-2022లో మళ్ళీ క్రికెట్ ను చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కేవలం మహిళల క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లు టీ20 ఫార్మాట్లో జరుగుతాయి. ఈ నేపథ్యంలో కామన్ వెల్త్ గేమ్స్-2022లో భాగంగా లీగ్ దశలో నేడు (జూలై 29, శుక్రవారం) ఆస్ట్రేలియాతో భారత్ మహిళల జట్టు తోలి టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ జట్టు మూడు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (52), ఓపెనర్లు షెఫాలీ వర్మ(48), స్మృతి మందాన (24) మాత్రమే రాణించారు. మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బౌలర్లలో జెస్ జొనాసెన్ 4, మెగాన్ షూట్ట్ 2 వికెట్లతో రాణించారు.
ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత్ బౌలర్ రేణుకా సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అలిస్సా హేలి (0), బెత్ మూనీ (10), మెగ్ లానింగ్ (8), తహిలా మెక్గ్రాత్ (14) వెంట వెంటనే అవుట్ అయ్యారు. అయితే ఆష్లే గార్డనర్ 35 బంతుల్లో 52 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ఆష్లే గార్డనర్ తో పాటుగా గ్రేస్ హ్యారిస్(37), అలానా కింగ్ (18 నాటౌట్) కూడా సహకారం అందించడంతో ఓటమి దశ నుంచి ఆసీస్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4, దీప్తి శర్మ 2, మేఘనా సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇక ఈ టోర్నమెంట్ లీగ్ దశలో జూలై 31న పాకిస్తాన్ తో, ఆగస్టు 3న బార్బడోస్ తో భారత్ జట్టు మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. కామన్ వెల్త్ గేమ్స్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బార్బడోస్ లతో భారత్ జట్టు గ్రూప్-ఎలో ఉంది. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా గ్రూప్-బి లో ఉన్నాయి. గ్రూప్-ఎ, గ్రూప్-బి నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY