కొన్ని రోజుల క్రితం తన భద్రత విషయంలో కేంద్రహోంశాఖకు రాసిన లేఖపై మరోసారి వివాదం చెలరేగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. కేంద్రహోంశాఖ కార్యదర్శికి ఆ లేఖ రాసింది తానేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఆ లేఖ తానే రాశానని, ఎన్నికల కమిషనర్గా తనకున్న అధికార పరిధిలోనే ఆ లేఖ రాసినట్టు వివరించారు. ఆ లేఖపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ అవసరం లేదని ఆయన అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా దాన్ని నిర్ధారించడంతో దీనిపై ఎలాంటి ఆందోళన, సందేహాలు అవసరం లేదని, అలాగే ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావులేదని రమేశ్ కుమార్ పేర్కొన్నారు.
ముందుగా మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్సవాంగ్కి లేఖ రాశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ లేఖపై రమేశ్ కుమార్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu