ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తదితరులతో కన్నా లక్ష్మీనారాయణకు అభిప్రాయబేధాలు ఉన్నట్లుగా కొంతకాలంనుంచి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన పార్టీలో తనకెదురవుతున్న పరిస్థితులపై వివరించారు. అలాగే తదుపరి కార్యాచరణపై కూడా ఆయన వారితో చర్చినట్లు సమాచారం. ఈ విషయాలపై ఒక అవగాహనకు వచ్చిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ గురువారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమక్షంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2014లో ప్రధాని మోదీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, నాలుగేళ్లు సామాన్య కార్యకర్తలా పార్టీలో పనిచేశానని తెలిపారు. ఈ క్రమంలో 2018లో పార్టీ అధ్యక్షుడిగా నియమించారని, అప్పటినుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. రాజధాని అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించామని, అలాగే కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అయితే సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పార్టీని తన సొంత సంస్థలా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే రాజీనామా తర్వాత ఆయన టీడీపీ లేదా జనసేన పార్టీల్లో చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి వివరాలను కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా మీడియాకు వెల్లడిస్తారని ఆయన వర్గం నేతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE