ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కలిశారు. ఇటీవలే టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ) కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాల నుండి వివిధ పారాయణాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా టీటీడీ ధార్మిక సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించిందని టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే చాగంటి కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా సీఎం వైఎస్ జగన్ ను కలిశారు.
ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు సీఎం వైఎస్ జగన్ శాలువా కప్పి సత్కరించి, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను అందజేశారు. సీఎంని కలిసిన వారిలో చాగంటితో పాటుగా శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ డాక్టర్ కే.ఐ.వరప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఇక సీఎంతో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను చాగంటి కోటేశ్వరరావు, వరప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ