సీఎం జగన్ తమకు అన్యాయం చేయరని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటారనే విశ్వాసం ఉందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే పదవుల కోసం పార్టీలు మారాల్సిన పని లేదని, తాను చివరి వరకు సీఎం జగన్తోనే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తరువాత రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా సీఎం జగన్ నిలిచారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశంసించారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగటానికి తోడ్పాటు అందిస్తున్నారని వెల్లడించారు. తామందరం సీఎం జగన్ అనుచరులమని, ఆయనేం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలకు అందరం కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. కాగా, కొడాలి నానికి కేబినెట్ స్థాయి ఉన్న ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్గా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇక మరో మాజీ మంత్రి పేర్ని నాని దీనిపై స్పందిస్తూ.. తొలి క్యాబినేట్లో తమకు చోటు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఎలాంటి అసంతృప్తి లేదని, తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. ఇంతకుముందు పని చేసినట్లే సీఎం జగన్ ఏ పని అప్పజెప్పినా ఇప్పుడు కూడా అంతే బాధ్యతగా పని చేస్తానని పేర్ని నాని వెల్లడించారు. తాను పదవుల కోసం ఎప్పుడూ పైరవీలు చేయలేదని, పదవిలో ఉన్నన్ని రోజులూ ఎవరికీ అన్యాయం చేయలేదని అన్నారు. ఆశావహుల్లో కొందరు మంత్రి పదవులు రాకపోవడంతో కొంత అసంతృప్తికి లోనవుతున్నారని, అది సహజమని చెప్పారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. పార్టీ ముఖ్యమని.. ఆ తర్వాతే పదవులని పేర్కొన్నారు పేర్ని నాని.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ