ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబుల్ ఆపరేటర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోల్ టాక్స్ను రద్దు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్ రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనను కలిసిన కేబుల్ ఆపరేటర్లు, తమకు పోల్ టాక్స్ వలన భారం పడుతోందని జగన్ దృష్టికి తెచ్చారనీ, దీనిపై అప్పుడు సానుకూలంగా స్పందించారని, అధికారంలోకి వచ్చాక దీనిని రద్దు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
అప్పుడు ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు పోల్ టాక్స్ రద్దుకు ఆమోదం తెలిపారని గౌతంరెడ్డి పేర్కొన్నారు. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని వేలమందికి టాక్స్ భారం తప్పనుందని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేబుల్ ఆపరేటర్లు అందరి తరపున సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తున్నామని అన్నారు. ఆపరేటర్ల వ్యవస్థకు ఈ నిర్ణయం వలన ఎంతో మేలు కలుగనుందని వెల్లడించిన ఆయన ఇకపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కేబుల్ ఆపరేటర్లకు ఎలాంటి ఒత్తిడిలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ను ప్రారంభించనున్నామని, దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని గౌతంరెడ్డి ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ