కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నవంబర్ 22, శుక్రవారం నాడు భారత్-బంగ్లాదేశ్ మధ్య మొదలైన చారిత్రక డే/నైట్ టెస్టులో తోలిరోజున భారత్ పట్టు బిగించింది. భారత్ బౌలర్ల ధాటికి తోలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 30.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. పింక్ బాల్తో మొదటగా బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో రాణించాడు. ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లతో రాణించారు. బంగ్లాదేశ్ జట్టులో నలుగురు బ్యాట్స్మన్ డకౌట్ కావడం విశేషం. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టులో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఈ దశలో చటేశ్వర్ పుజారా (55) పరుగులతో రాణించగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 59 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లులో ఇబాదత్ 2, అల్ అమీన్ 1 వికెట్ పడగొట్టారు. బంగ్లాదేశ్ స్కోర్ కంటే ప్రస్తుతం భారత్ 68 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లీతో పాటుగా అజింక్య రహానే 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
భారత్ తొలిసారిగా ఆడుతున్న ఈ డే/ నైట్ పింక్ బాల్ టెస్టులో, ముందుగా టాస్ గెలిచినా బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా ఓపెనర్ కైస్ ను ఇషాంత్ శర్మ అవుట్ చెయ్యగా, కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్ ను ఖాతా తెరవకముందే ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. ముష్ఫికర్, మహ్ముదుల్లా కూడ వెంటనే పెవిలియన్ బాట పట్టడంతో బంగ్లాదేశ్ 38 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అనంతరం లిటన్ దాస్ 24 పరుగులుతో కొంతసేపు పోరాడినా షమీ బౌలింగ్ లో తలకు గాయమవడంతో రిటైర్హర్ట్గా వెనుదిరిగాడు. అతని స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్లుగా వచ్చిన మెహదీ హసన్ బ్యాటింగ్ చేశాడు. చివరి 24 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 106 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఇక తోలి ఇన్నింగ్స్ లో చేసిన 59 పరుగులతో టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్గా విరాట్ కోహ్లి (86 ఇన్నింగ్స్) రికార్డ్ సాధించాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ (97 ఇన్నింగ్స్) పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.