ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారికి ఉచిత వైద్యం అందించడంలో భాగంగా అందుకు సంబంధించిన 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ అనుమానితులకు వైద్యమందిస్తే రూ.16,405 చెల్లించనున్నారు. ఈ మొత్తంలో వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్(పిపిఈ) కిట్ల కోసం రూ.5,631 ఉపయోగించనున్నారు. ఇక కరోనా వైరస్ నిర్ధారణ జరిగిన బాధితులకు రూ.65 వేల నుంచి రూ.2.15 లక్షల వరకూ చెల్లించనున్నారు. కేసు తీవ్రతను బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు. సంబంధిత ఆసుపతుల్లో ఈ ఆదేశాలను తక్షణమే పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే హెల్త్ వర్కర్స్ అందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.