ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85 లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 2019–20 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల యొక్క పూర్తిస్థాయి అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ ఏప్రిల్ 21, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ, ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మీడియం పాఠశాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరూ కోర్టును ఆశ్రయించడం, కోర్టు జీవోలను రద్దు చేయడంతో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu