ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా ఐదు అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. కొన్ని స్థానాలపై తెలుగుదేశం పార్టీ ఇంకా తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న స్థానాలతో పాటు.., ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో కూడా కొన్నిచోట్ల మార్పులకు అవకాశం ఉంది. అలాగే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీచేసే స్థానంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అలాగే.. మరో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావును విజయనగరం జిల్లా గజపతినగరంలో నిలపాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. ఆయన గతంలో ఇదే జిల్లా ఎచ్చెర్లకు ప్రాతినిధ్యం వహించారు.
వాస్తవానికి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చిన ఆ పార్టీ.. తర్వాత వెనక్కి తీసుకుని ఎచ్చెర్లను కేటాయించింది. దీంతో కళాను గజపతి నగరానికి మార్చే విషయమై చర్చ నడుస్తోందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితమే గజపతినగరానికి కొండపల్లి శ్రీనివాస్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అక్కడ ఆయనకు అంత అనుకూలత రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లా చీపురుపల్లికి ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇన్చార్జిగా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును నిలపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. విశాఖలోని భీమిలిపై ఇంకా తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో దర్శిలో ప్రవాసాంధ్రుడు గరికపాటి వెంకట్, ప్రస్తుత ఇన్చార్జి గోరంట్ల రవికుమార్, గొట్టిపాటి లక్ష్మి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వెంకట్ కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్, గుంతకల్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లా ఆలూరుపై కూడా టీడీపీ ఇంకా నిర్ణయానికి రాలేదు. కర్నూలు జిల్లా ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు దానిని వెనక్కి తీసుకుని ఆలూరు కేటాయించే ప్రతిపాదనపై రెండు పార్టీల మధ్య చర్చ నడుస్తోంది. లోక్సభ సీట్లలో ఇంకా ఒంగోలు, అనంతపురం, కడప, రాజంపేట అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో ఒంగోలులో మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని గతంలో అనుకున్నారు. కానీ ఢిల్లీ మద్యం కేసులో తాజా పరిణామాలతో రాఘవరెడ్డి స్థానంలో ఆయన తండ్రి, సిటింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు ముందుకొచ్చినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా టీడీపీ ప్రకటించిన 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల్లో అధికులు పాతవారే. వీరిలో వసంత కృష్ణప్రసాద్ వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, గౌతు శిరీష, కోళ్ల లలితకుమారి, వనమాడి వెంకటేశ్వరరావు, అయితాబత్తుల ఆనందరావు, బోడె ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేలు. డాక్టర్ అరవిందబాబు.. నరసరావుపేటకు, చీరాలకు కొండయ్య యాదవ్ టీడీపీ ఇన్చార్జులుగా ఉన్నారు. ఇన్చార్జులు కాకున్నా.. పాతపట్నంలో సామాజికవేత్త మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో కృష్ణప్పపేట సర్పంచ్ గొండు శంకర్ తొలిసారి టికెట్ దక్కించుకున్నారు. కొండయ్య యాదవ్ అసెంబ్లీకి పోటీచేయడం ఇదే మొదటిసారి. అయితే ఆయన 2009 లోక్సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY