ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నివారణ కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికారపార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ ఆపత్కాల సమయంలో కరోనా మహమ్మారి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచిపెట్టి పోయేంతవరకు చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపైనే శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
” అగ్రరాజ్యాలుగా పేరొందిన దేశాలు సైతం కరోనా ప్రభావంతో చేష్టలుడిగి వణికిపోతున్నాయి. వారి ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైతుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారత్ సహకారం కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను సైతం విడిచిపెట్టలేదు. కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఈ మహమ్మారి ఎప్పటికి శాంతిస్తుందో ఊహ కందడం లేదు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూసి బెంబేలెత్తుతున్నారు. ప్రపంచం అంతా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో తప్పులు ఎత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికారపార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన తరుణంలో రాజకీయాలను భుజాలకెత్తుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ఆయనపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిన అవసరముంది. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu