కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీలో మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో విడతలవారీగా కర్ఫ్యూ సడలింపులలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేవిధంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూకు సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే దుకాణాలకు జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఫోటో తీసి పంపినా జరిమానా విధించనున్నారు. ఇక రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను కఠినంగా చేయనున్నట్టు పేర్కొన్నారు.
ముందుగా సోమవారం ఉదయం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులు, వ్యాక్సినేషన్ పై రాష్ట్ర మంత్రులు, కోవిడ్ టాస్క్ఫోర్స్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ ఆంక్షల సడలింపు సహా సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మాస్క్ ధరించని వారికి రూ.100 జరిమానా ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ఎవరూ గుంపులుగా గుమిగూడకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు, మార్కెట్లు, దుకాణాలు సహా ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు తప్పనిసరిగా ధరించేలా చూడాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ